పూర్తిస్థాయిలో నిండుకున్న పోచారం ప్రాజెక్టు
2,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో.. మిగులు వరద నీరు నిజాంసాగర్కు విడుదల
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలంలో ఉన్న పోచారం ప్రాజెక్టు ఈ వర్షాకాలంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యాన్ని చేరుకుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 1464 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం సుమారు 2,200 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదవుతోంది. దీంతో ప్రాజెక్టులో అదనంగా చేరుతున్న వరద నీటిని దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
పోచారం ప్రాజెక్టు నిండడంతో పరిసర ప్రాంతాల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే యాసంగి, వానాకాల పంటలకు సాగునీటి కొరత ఉండదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగే అవకాశముందని రైతులు చెబుతున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, దిగువ ప్రాంతాల ప్రజలు నదులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్నందున పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

