బీబీపేట్లో రహదారుల దుస్థితి.. నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
ఎన్ని వార్తలు వచ్చినా పరిష్కారం శూన్యం.. రోడ్లు, డ్రైనేజీలపై ప్రజల ఆవేదన. గ్రామ సభ ద్వారా నిధుల వివరాలు వెల్లడించాలని మాజీ ఎంపీటీసీ కొర్వి నర్సింహులు డిమాండ్.
బీబీపేట్ మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో రహదారుల దుస్థితిపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఇంద్రనగర్ కాలనీలో రహదారిపై ఏర్పడిన గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వర్షాకాలం కావడంతో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఈ సమస్యపై పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు మారుతున్నా సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారుల మరమ్మతు పనులను వేగవంతం చేయాలని కోరుతున్నారు.