హామీలు అమలు చేసేవరకు పోరుబాట
“సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తాం” — మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలను దగా చేసిందని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయం ఎదుట సుమారు 420 అడుగుల భారీ బ్యానర్ను ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పెన్షన్లు, ఉద్యోగాలు, సాగునీరు, విద్యుత్, నిరుద్యోగ సమస్యలు, యూరియా పంపిణీ వంటి అనేక అంశాల్లో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గంప గోవర్ధన్ ఆరోపించారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రజలకు ఎదురవుతున్న సమస్యలు, ప్రభుత్వ విధానాల వల్ల కలుగుతున్న ఇబ్బందులను ఈ నిరసన ద్వారా ఎత్తిచూపామని తెలిపారు.
ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని, అవసరమైతే ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఇంటింటికీ తిరిగి కరపత్రాల పంపిణీ
నిరసన కార్యక్రమం అనంతరం కౌన్సిలర్ ప్రభాకర్ యాదవ్ వార్డులో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటి అమలులో చోటుచేసుకున్న జాప్యంపై ప్రజలకు వివరించారు.
పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు ముజీబ్తో పాటు మున్సిపల్ వైస్ చైర్మన్ కాసర్ల గోదావరి స్వామి, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు గోపి గౌడ్, నల్లవెల్లి అశోక్, కౌన్సిలర్లు ఆఫీజ్, కుంభాల రవి, మన్సూర్, జెర్సీ నర్సింలు, మామిళ్ల లక్ష్మణ్, గిరిగంటి లక్ష్మణ్, స్వప్న, పిట్ల వేణు, కృష్ణాజిరావు, మాసుల లక్ష్మీనారాయణ, పార్టీ ప్రతినిధి బలవంతరావు తదితరులు పాల్గొన్నారు.
మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట, కామారెడ్డి, భిక్కనూర్ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలు తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.