జనప్రియ ఆర్కేడియాలో చెట్ల కొమ్మల తొలగింపు
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 189 యాప్రాల్ డివిజన్ పరిధిలోని కౌకూర్ జనప్రియ ఆర్కేడియాలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో, యూబీడీ (Urban Biodiversity) విభాగం సహకారంతో జనప్రియ ఆర్కేడియా సెంట్రల్ పార్క్, గణేష్ మండపం వేదిక పరిసరాల్లో ప్రమాదకరంగా మారిన చెట్ల కొమ్మలను తొలగించారు. దీంతో కాలనీవాసులకు భద్రతతో పాటు రాకపోకలకు కూడా సౌలభ్యం ఏర్పడింది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు తుడిమెళ్ల మల్లికార్జున మాట్లాడుతూ, వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రజల సంక్షేమం, కాలనీల అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.
జనప్రియ ఆర్కేడియా అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశంపై స్పందిస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన యూబీడీ సూపర్వైజర్ రమేష్కు నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జనప్రియ ఆర్కేడియా ప్రతినిధి శ్రీనివాస్, యాప్రాల్ డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివరాజ్, యువ నాయకుడు అజయ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.