మత్స్యకారులకు శుభవార్త.. ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు మంజూరు
మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో కీలక నిర్ణయం – మత్స్యకార సంఘాల హర్షం
హైదరాబాద్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం కోసం రూ.116 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మత్స్యకార కుటుంబాలకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడనున్నాయని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవతో ఈ నిధులు మంజూరయ్యాయని నాయకులు తెలిపారు. ఈ నిధులతో చెరువులు, జలాశయాల్లో ఉచితంగా చేపపిల్లలు, రొయ్య పిల్లలను వదలడం ద్వారా చేపల ఉత్పత్తి పెరిగి, మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు ఆధ్వర్యంలో మత్స్యకార సంఘాల నాయకులు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరిని కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో అజ్జమోని నరసింహ, క్యాసారపు వెంకటయ్య, ఆవుల ఈశ్వర్, బొమ్మసాని సత్యనారాయణ, గొడుగు బాలచందర్, పిట్టల నరేష్, భీమనమోని వెంకటయ్య, మస్కూరి బంగారయ్య, బజారు మంజుల రాముడు, చెప్ప బాబు, జటమోని శ్రీనివాసులు, అనుపటి మల్లేష్, తెప్ప తిరుపతయ్య, జంగయ్య, ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు చెరుకూరి వెంకటేష్తో పాటు పలువురు మత్స్యకార సంఘాల ప్రతినిధులు, కుల బంధువులు పాల్గొన్నారు.
ప్రధాన అంశాలు:
✔ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.116 కోట్ల నిధుల మంజూరు.
✔ ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.
✔ రాష్ట్రవ్యాప్తంగా మత్స్యకారులకు ఉపాధి, ఆదాయం పెంపునకు కీలక నిర్ణయం.
✔ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరికి మత్స్యకార సంఘాల ప్రత్యేక కృతజ్ఞతలు.
— తెలంగాణ పవార్ దినపత్రిక
