సర్వే నంబర్ 983 రైతులకు న్యాయం చేయాలి
అటవీ (ROFR) భూములుగా ఆన్లైన్లో నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు — 181 మంది రైతుల ఆవేదన
రైతుల ప్రధాన ఆరోపణ
లింగంపేట్ మండల కేంద్రం శివారులోని సర్వే నంబర్ 983లో తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన అసైన్మెంట్ భూములను అటవీ శాఖకు సంబంధించిన ROFR భూములుగా ఆన్లైన్లో నమోదు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వే నంబర్ 983లో సుమారు 181 మంది నిరుపేద రైతులకు భూములు ఉన్నాయని వారు తెలిపారు. తమ తాతలు, ముత్తాతల కాలం నుంచి ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని పేర్కొన్నారు. తమ వద్ద పాత పట్టా పాస్బుక్లతో పాటు కొత్తగా మంజూరైన ధరణి పాస్బుక్లు కూడా ఉన్నాయని, గతంలో ఈ భూములకు సంబంధించి రైతుబంధు కూడా పొందామని రైతులు తెలిపారు.
అదే సర్వే నంబర్లో లింగంపేట్ తహసీల్దార్ కార్యాలయం, మండల అభివృద్ధి కార్యాలయం, పోలీస్ స్టేషన్, జూనియర్ కళాశాల, రైతు వేదిక, విద్యుత్ సబ్స్టేషన్తో పాటు నిరుపేదల ఇళ్లు తదితర ప్రభుత్వ, ప్రజా వినియోగ నిర్మాణాలు కూడా ఉన్నాయని వారు వివరించారు.
ప్రస్తుతం తమ భూములు ఆన్లైన్లో అటవీ శాఖకు చెందిన ROFR భూములుగా చూపిస్తున్నాయని రైతులు వాపోయారు. దీంతో రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు, ఎరువులు తదితర ప్రభుత్వ, వ్యవసాయ సంబంధిత ప్రయోజనాలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
తమ పొలాల్లో పండించిన ధాన్యాన్ని విక్రయించడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై కొంతమంది రైతులు అధికారులను ఆశ్రయించగా, సుమారు 40 మంది రైతులకు సంబంధించిన భూములను తిరిగి అసైన్మెంట్ భూములుగా ఆన్లైన్లో నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఇంకా సుమారు 140 మంది రైతుల భూములు అసైన్మెంట్ భూములుగా మార్చాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్కు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదని బాధిత రైతులు తెలిపారు.
తమ భూముల రికార్డులను పరిశీలించి, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్ రికార్డుల్లో సవరణలు చేసి న్యాయం చేయాలని వారు అధికారులను కోరుతున్నారు.
సమస్య పరిష్కారం కాకపోతే ధర్నా, రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సర్వే నంబర్ 983 బాధిత రైతులు తెలిపారు.
భూముల రికార్డులను పరిశీలించి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఆన్లైన్లో సవరణలు చేయాలి
ప్రభుత్వం, జిల్లా అధికారులు స్పందించి తమ భూముల సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు.