పేదల సొంతింటి కలకు ‘ఇందిరమ్మ’ భరోసా
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాలతో ఎల్లారెడ్డిలో ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ
ఎల్లారెడ్డి, ఆగస్టు 11: పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 1వ, 7వ, 12వ వార్డుల్లో ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు.
ఎల్లారెడ్డి శాసనసభ్యులు శ్రీ మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు మున్సిపల్ పాలకవర్గం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. లబ్ధిదారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ శ్రీ పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్ శ్రీమతి మత్తమాల భాగ్యవతి, సంబంధిత వార్డు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ మాట్లాడుతూ.. పురిగుడిసెల్లో నివసిస్తున్న అతినిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఇళ్ల నిర్మాణాలను నాణ్యతా ప్రమాణాలతో, త్వరితగతిన పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాలకు భద్రతతో కూడిన సొంత గృహాలు అందడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు.
లబ్ధిదారులకు అవసరమైన సహకారం అందిస్తూ నిర్మాణ పనులు సకాలంలో పూర్తయ్యేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగ్జీవన్, అధికారులు, సిబ్బంది, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, కౌన్సిలర్లు తిరుపతి, రఫీక్, విద్యాసాగర్, గఫార్, సిద్ధి శ్రీధర్, చంద్రయ్య, శంకర్, దశరథ్, లక్ష్మీ శివానంద్, ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ పవార్ దినపత్రిక
