ఎల్లారెడ్డి అభివృద్ధికి సీఎం హామీ
ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే
మదన్ మోహన్ ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డిను ఆయన నివాసంలో
మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి అత్యంత
కీలకమైన పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి,
అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు.
ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ
పనులకు వెంటనే పరిపాలనా, ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయాలని
ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో
నూతన ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని
కోరారు.
అదేవిధంగా బాన్సువాడ–ఉప్పల్వాయి ప్రధాన రహదారిపై
సర్వాపూర్–మొండిసడక్ మధ్య హై లెవల్ బ్రిడ్జి,
అలాగే గాంధారి–తిమ్మాపూర్ మధ్య హై లెవల్ బ్రిడ్జి
నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ రెండు వంతెనలు
నిర్మితమైతే వర్షాకాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న రాకపోకల ఇబ్బందులు
తొలగి, ప్రయాణం మరింత సులభతరం అవుతుందని ఎమ్మెల్యే వివరించారు.
విద్యారంగ అభివృద్ధిలో భాగంగా గాంధారి మండలంలో
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.
అలాగే లింగంపేట, సదాశివనగర్, రామారెడ్డి, గాంధారి మండలాల్లోని
ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయ భవనాలు
శిథిలావస్థకు చేరుకున్నందున, ఆయా మండలాల్లో
ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ (IOC)
భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, అవసరమైన
నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే మదన్ మోహన్ సమర్పించిన అభివృద్ధి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి సానుకూలంగా పరిశీలించినట్లు తెలిపారు. నియోజకవర్గ
అభివృద్ధికి అవసరమైన పనులకు నిధులు విడుదల చేసి,
దశలవారీగా పనులను అమలు చేస్తామని ముఖ్యమంత్రి
హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల అవసరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి
అభివృద్ధి పనులకు ప్రాధాన్యత కల్పించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్
చేస్తున్న కృషికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడంపై
నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
