ఆరోగ్యశ్రీ వేడుకలు ఘనంగా
ఎల్లారెడ్డి: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఆరోగ్యశ్రీ పథకం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటులో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు.
గతంలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు వేలాది రూపాయలు ఖర్చు అవుతున్న విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి దృష్టికి మందకృష్ణ మాదిగ తీసుకెళ్లారని తెలిపారు. పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయించాలని కోరుతూ ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొన్నారు.
ఈ సమస్య పరిష్కారం కోసం మందకృష్ణ మాదిగ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టడంతో పాటు హైదరాబాద్లోని ట్యాంక్బండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారని తెలిపారు. ఆ సమయంలో రహదారులు దిగ్బంధం కావడంతో ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు.
ఢిల్లీలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మందకృష్ణ మాదిగకు ఫోన్ చేసి గుండె జబ్బులతో బాధపడుతున్న పేద పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తానని హామీ ఇచ్చిన అనంతరం దీక్ష విరమించినట్లు తెలిపారు.
అనంతరం పేదలకు ఉచిత వైద్యం అందించే కార్యక్రమానికి ఏం పేరు పెట్టాలనే విషయంపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి మందకృష్ణ మాదిగను సంప్రదించారని, ఈ సందర్భంగా ‘శోభన్ ఆరోగ్యశ్రీ’ పేరును పెట్టాలని మందకృష్ణ మాదిగ సూచించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు. అయితే అనంతరం ‘ఆరోగ్యశ్రీ’ పేరుతో పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందుతోందని, ఈ పథకం సాధనలో మందకృష్ణ మాదిగ చేసిన పోరాట స్ఫూర్తిని ప్రజలు గుర్తుంచుకోవాలని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.