భారీ వర్షాలపై అప్రమత్తం… క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పర్యటన
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం పలు వరద ప్రభావిత ప్రాంతాలను
క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం జిల్లా పోలీసు సూపరింటెండెంట్
ఎం. రాజేష్ చంద్రతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి,
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
లింగంపల్లి కుర్దు వంతెన పరిశీలన
లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద వరదలకు దెబ్బతిన్న తాత్కాలిక వంతెనను
కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని
ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణ నాణ్యతలో రాజీ పడవద్దని,
భవిష్యత్తులో వరదలను తట్టుకునేలా శాశ్వత ప్రమాణాలతో పనులు చేపట్టాలని సూచించారు.
వంతెన మరమ్మతు పూర్తయ్యే వరకు గ్రామ ప్రజలకు ప్రత్యామ్నాయ రాకపోకల మార్గాలు ఏర్పాటు చేయాలని,
ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయాలని రెవెన్యూ,
పోలీసు శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.
కేకేవై రహదారి పునరుద్ధరణ
లింగంపేట మండలం లింగంపల్లి గ్రామ సమీపంలోని కేకేవై రహదారిపై వరదలతో దెబ్బతిన్న
కి.మీ. 121/2-4 ప్రాంతంలో అత్యవసర పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని,
ఆ మార్గంలో రాకపోకలు తిరిగి ప్రారంభమైనట్లు కలెక్టర్ వెల్లడించారు.
ప్రజలకు కీలక సూచనలు
- వర్షపు నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దు.
- యువత సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలి.
- తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలి.
- లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలి.
- అత్యవసర పరిస్థితుల్లో వెంటనే జిల్లా యంత్రాంగానికి సమాచారం అందించాలి.
పెద్ద చెరువు వద్ద హెచ్చరిక
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు పూర్తిస్థాయిలో నిండిపోయి
పొంగిపొర్లుతున్న నేపథ్యంలో జీఆర్ కాలనీతో పాటు పరివాహక ప్రాంత ప్రజలు
అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అవసరం లేకుండా చెరువు పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరించారు.
వర్షాల వల్ల జరిగిన నష్టం
- 171 గృహాలు దెబ్బతిన్నాయి.
- 167 గృహాలు పాక్షికంగా, 4 గృహాలు పూర్తిగా కూలిపోయాయి.
- 44 చెరువులు ప్రభావితమయ్యాయి.
- 32 రహదారులు దెబ్బతిన్నాయి.
- వంతెనలు, కల్వర్టులు, చెరువు కట్టలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది.
నష్టపరిహార అంచనాలను వేగంగా పూర్తి చేసి, దెబ్బతిన్న రహదారులు, చెరువులు,
వంతెనలు, ప్రభుత్వ ఆస్తుల పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని
సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమన్వయంతో పనిచేయాలని ఆదేశం
రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి, మున్సిపల్, విద్యుత్,
వ్యవసాయ తదితర శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు
తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో 24 గంటల పర్యవేక్షణ కొనసాగించాలని,
ప్రతి మండలంలో సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ పర్యటనలో ఎల్లారెడ్డి ఆర్డీఓతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు విక్టర్, ఎన్.వై. గిరి, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ,
జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు,
ఆర్ అండ్ బి ఈఈ రమేష్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
