కామారెడ్డి అభివృద్ధికి రూ.105 కోట్లకు పైగా నిధులు
కామారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు
మహమ్మద్ అలీ షబ్బీర్ చేసిన కృషి ఫలితంగా పలు శాఖల ద్వారా భారీ మొత్తంలో అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, ప్రజా సౌకర్యాల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.105 కోట్లకు పైగా నిధులు సమకూరగా, మరిన్ని నిధులు కూడా త్వరలో మంజూరు కానున్నట్లు వెల్లడించారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.75.19 కోట్ల నిధులు మంజూరుకాగా, ఈ నిధులతో హామ్ (HAM) ఏజెన్సీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
అలాగే నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం రోడ్లు–భవనాల శాఖ ద్వారా
రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధుల మంజూరుకు సహకరించిన
పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రోడ్లు–భవనాల శాఖ మంత్రి
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డిలకు షబ్బీర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులతో కలిసి మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించి కామారెడ్డి అభివృద్ధికి నిధులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే రోడ్ల అభివృద్ధికి నిధులు కేటాయించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఫోన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేశారు.
షబ్బీర్ మాట్లాడుతూ, కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలో ఎఫ్డీఏ (FDA) నిధుల కింద రూ.25 కోట్లు, మరో రూ.20 కోట్లు, సీఆర్ఆర్ (CRR) నిధుల కింద అదనంగా రూ.32 కోట్లు కూడా మంజూరు కానున్నాయని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నాయకత్వంలో కామారెడ్డిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, ప్రజలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేస్తున్న అభివృద్ధి కృషిని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అభినందించారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతుందని షబ్బీర్ తెలిపారు.
