ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
కామారెడ్డి జిల్లాలో ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం నూతన జిల్లా కార్యవర్గాన్ని రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శనివారం నిర్వహించిన సంఘం సమావేశంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కృష్ణవర్ధన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.
ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం సంఘాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
నూతన కార్యవర్గంలో జిల్లా గౌరవ సలహాదారుగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా సుధీర్ కుమార్, నిర్మల, సంయుక్త కార్యదర్శిగా ఇటికల మహేష్, కోశాధికారిగా మహేందర్, మహిళా కార్యదర్శులుగా జననిరాణి, పద్మ ఎన్నికయ్యారు.
కార్యనిర్వహణ కార్యదర్శులుగా అంజయ్య, సంతోష్, జయవర్ధన్, మీడియా ఆర్గనైజర్ కార్యదర్శిగా అనిల్ బాధ్యతలు స్వీకరించారు. కార్యవర్గ సభ్యులుగా తిలోత్తమ, సందీప్, రాజు, లక్ష్మారెడ్డి, నర్సవ్వ, శివాజీ, కాశమని, మధుసూదన్, వినోద, సురేఖ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రెండోసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ అల్లావుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర యూనియన్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి నాయకత్వంతో కలిసి కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించడంతో పాటు, సేవలు అందిస్తున్న ఉద్యోగుల సంక్షేమం, హక్కులు, సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామని మహమ్మద్ అల్లావుద్దీన్ తెలిపారు.
జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సాయిబాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యశ్రీ ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యతను మరింత బలోపేతం చేస్తామని అన్నారు. ఉద్యోగులకు ఏ సమస్య వచ్చినా జిల్లా యూనియన్ తరఫున అండగా నిలిచి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.